Tuesday 3 May 2016

OUR BELOVED UTF LEADER DACHURI RAMIREDDY

Home / Editorial / Neti Vyasam

ఆదర్శనేత రామిరెడ్డి
Posted On Mon 02 May 23:32:07.337947 2016

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వ్యవస్ధాపకులో ఒకరైన దాచూరి రామిరెడ్డి గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఒంగోలులో సోమవారం ఉదయం 11గంటలకు కన్నుమూశారు. చెన్నుపాటి ఆశయాలతో యుటిఎఫ్‌ నేతగానే అఖిల భారత ఉద్యమాన్ని నిర్మించిన నేత ఆయన. నెల్లూరు జిల్లా రావూరి సమితి మద్దెలమడుగు గ్రామంలో 1958లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగిడిన నాటి నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1959లో ఆనాటి రాపూరి సమితి ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యదర్శిగా ఉద్యమ జీవితం ప్రారంభించారు. 1960 నుండి 1968 వరకు నెల్లూరు జిల్లా కమిటి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఆ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉంటూనే 1970లో ప్రకాశం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పరీక్షా విధానంలో నూతన ఒరవడి తెచ్చారు. ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన అవకాశవాద ధోరణులను ఎదిరించి చెన్నుపాటి ఆశయాలతో ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అప్పారి వెంకటస్వామి, నాదెళ్ల సీతారామాచారి, సూర్యనారాయణరాజు లాంటి నేతలతో కలిసి 1974 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
యుటిఎఫ్‌ ఆవిర్భావం నుంచీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనంతరం 1976 నుండి 2000వ సంవత్సరం వరకు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. యుటిఎఫ్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలకూ, అన్ని మేనేజ్‌మెంట్లకూ, అన్ని కేడర్లకూ ఒకే సంఘంగా విస్తరింపజేయటంలో ఎనలేని కృషి చేశారు. ఆనాటి ఐక్య ఉద్యమాలకు వేదిక అయిన ఎఫ్‌ఎపిటిఒ కో ఛైర్మన్‌గా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి వ్యూహ రచన చేయడంలో ఆయన దిట్ట. సమరశీల పోరాటాలు నడపటమేకాదు, ఒక్కరోజు సమ్మెతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును ఒప్పించి గ్రాఫింగ్‌ స్కేల్‌పై ఆటోమాటిక్‌ అడ్వాన్‌మెంట్‌ స్కేల్‌ తేవటంలో ఆయన దూరదృష్టి నాయకత్వ లక్షణంతోపాటుగా సమయస్ఫూర్తి కనిపిస్తుంది.
ఆదర్శవంతంగా..
నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలిసిన జీవనశైలి ఆయనది. 16 ఏళ్ల ఉద్యోగ సర్వీసును వదిలి యుటిఎఫ్‌లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1982లో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి ఎంఎల్‌సిగా గెలుపొందారు. 2007లో మరలా ఎంఎల్‌సిగా విజయం సాధించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి సంఘాలు చేసే పోరాటాలను శాసన మండలి వేదికపై ప్రతిబింబించేవారు. శాసనమండలి సభ్యునిగా వచ్చిన అలెవెన్సులన్నీ సంఘానికి జమ చేసి, సంఘం ఇచ్చిన నామమాత్రపు అలవెన్సుతో సాధారణ జీవితం గడిపిన ఆదర్శమూర్తి ఆయన. కార్యకర్తల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో క్రమశిక్షణ విషయంలో అంతే కఠినంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా వచ్చినా కార్యకర్తల ఇళ్లలో ఉండేవారు. వారి కుటుంబ సభ్యులతో కలిసిపోయే వారు. తమకు స్వంత పిల్లలు లేకపోయినా కార్యకర్తల ఇళ్లలో పిల్లలు ఆయన్ని ఆత్మీయునిగా తాతయ్యగా, మామయ్యగా, భావించేవారు. పాఠశాల, సంఘ సమావేశం, మహాసభ ఏదైనా నిర్ణీత సమయానికి ముందే హాజరయ్యేవారు. కార్యకర్తలకు ఆయన మొదటి సూచన సమయాన్ని పాటిచాలని.
మంచి ఉపాధ్యాయుడే నిజమైన కార్యకర్త
ఉపాధ్యాయుడు పనిచేసే చోట నివాసం ఉండాలి. స్ధానిక ప్రజలతో మమేకం కావాలి అని నిత్యం చెప్పటంతోపాటు ఆయన ఆచరించి చూపారు. ఆయన ఉద్యోగం చేసిన చోటే నివాసం ఉండేవారు. సాయంత్రం పూట వయోజనులకు పాఠాలు చెప్పేవారు. అవసరమైన సందర్భాలలో పేదలకు వైద్యం చేసి ఆదుకున్న మహామనిషి ఆయన. ప్రజల అవసరాలను గుర్తించి యుటిఎఫ్‌ కార్యకర్తలందరికీ నెల్లూరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సహకారంతో కనీస వైద్యం, ఇంజక్షన్‌ చేయడంలో శిక్షణ ఇప్పించి గ్రామాల్లో చదువు చెప్పటంతోపాటు వైద్యంకూడా చేసి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా ఉండాలని నిరూపించారు.
1981-84 మధ్య ఉపాధ్యాయులు సాధించుకున్న రీగ్రూపింగు స్కేళ్లు, ప్రధానోపాధ్యాయుల స్కేళ్లు, బిఇడి అర్హత లేకుండా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు 15 సంవత్సరాల టైం స్కేలు, భాషా పండితుల 1983 అప్‌గ్రేడేషన్‌, ఎయిడెడ్‌ టీచర్ల డైరెక్టు పేమెంటు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ రక్షణ, రిటైర్మెంట్‌ సౌకర్యాల వంటివన్నీ ఆయన నేతృత్వంలో జరిగిన ఉమ్మడి పోరాట విజయాలు. యుటిఎఫ్‌ అధికార పత్రిక 'ఐక్య ఉపాధ్యాయ' సంపాదక వర్గ సభ్యుడుగా ''నియమ నిబంధనలు'' అనే శీర్షికను నడిపారు. దీనిద్వారా అశేష పాఠకుల ఆదారాభిమానాలనూ పొందారు. ''అధ్యాపక దర్శిని'' పేరుతో ప్రభుత్వ ఉత్తర్వులను ఏర్చి కూర్చి ఐదు భాగాలుగా వెలువరించడంలో ఆయన ప్రధాన పాత్ర నిర్వర్తించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉపాధ్యాయ సేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేశారు.
2000వ సంవత్సరంలో యుటిఎఫ్‌ రజతోత్సవాలకు అధ్యక్షులుగా స్వచ్చందంగా తప్పుకొని యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పారు.

No comments:

Post a Comment